CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:10 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కరీంనగర్‌లో భక్తి పారవశ్యం.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు

కరీంనగర్, జూలై 26 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని వైశ్య భవన్‌ ఆదివారం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలను అందించారు.

కార్యక్రమానికి విచ్చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును కరీంనగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ సాదరంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి తమ గౌరవాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, మానవతా విలువలను సరళమైన భాషలో ప్రజలకు చేరవేస్తూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సేవలు విశేషమైనవని కొనియాడారు.

అనంతరం చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనంలో ధర్మాచరణ, కుటుంబ విలువలు, సంస్కృతి పరిరక్షణ, భక్తి, నైతిక జీవనం వంటి అంశాలపై హృద్యంగా వివరించారు. ఆయన ప్రసంగాన్ని వినేందుకు తరలివచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత నిండిన వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.