CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:48 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజలకు మెరుగైన పోలీసు సేవలే లక్ష్యం

  • ఆమనగల్లు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ జానకి రెడ్డి
  • పెండింగ్ కేసుల పరిష్కారం, సైబర్ నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై కీలక ఆదేశాలు

ఆమనగల్లు, జూలై 25 (చైతన్యగళం):
మహేశ్వరం డివిజన్ ఏసీపీ ఎస్. జానకి రెడ్డి శనివారం అమన్‌గల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, విజిబుల్ పోలీసింగ్, శాంతిభద్రతల పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలను ఏసీపీకి వివరించారు. అనంతరం స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీపీ పలు కీలక సూచనలు జారీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు గ్రేవ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్ , ఈ-సాక్షి వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించి దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ పారదర్శకంగా నిర్వహించాలని, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా, హరితవనంగా ఉంచాలని పేర్కొన్నారు. సైబర్ భద్రత, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఏసీపీ జానకి రెడ్డి సూచనలను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తామని ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.