CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 7:05 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గడపగడపకు న్యాయ సేవలు.. ప్రజల్లో చైతన్యం

  • ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులంతా ముందుకు రావాలి: చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి నాగేశ్వరరావు

మహబూబాబాద్, జూలై 25(చైతన్యగళం): ఆర్థిక, సామాజిక లేదా ఇతర ఏ కారణాల వల్లనైనా ఎవరూ న్యాయానికి దూరం కాకూడదనే లక్ష్యంతో న్యాయ సేవాధికార సంస్థల చట్టం అమల్లోకి వచ్చిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నామని జిల్లా న్యాయ సేవా సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి నాగేశ్వరరావు తెలిపారు.

జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం కురవి మండలంలోని అనంతారం తదితర గ్రామాల్లో న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్‌ల నిర్వహణ, వాటి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. చిన్న చిన్న వివాదాలను కోర్టు కేసులు లేకుండానే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌లు ఉత్తమ వేదికగా నిలుస్తాయని వివరించారు.

అనంతరం సంస్థ మధ్యవర్తిత్వ న్యాయవాది వై. చెన్నమల్లారెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక దురాచారాలకు కుటుంబాలు దూరంగా ఉండాలని, ప్రతి చిన్నారి విద్యాభ్యాసం, భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఎస్సై సునంద పాల్గొని మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న రక్షణ వ్యవస్థలపై అవగాహన కల్పించారు.

ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు మహబూబాబాద్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని, న్యాయ సలహాల కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చని అధికారులు సూచించారు.