తిరుమల, జూలై 25 (చైతన్యగళం):
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా, ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
జూలై 24న మొత్తం 78,721 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 4.98 కోట్ల ఆదాయం లభించింది. 38,018 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 4.37 లక్షల లడ్డూలు విక్రయించారు. అలాగే 2.87 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించగా, 3,682 మంది భక్తులకు వైద్య సేవలు అందించారు. వారాంతం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.