- ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఇప్పిస్తానని మోసం.. నిందితుడి అరెస్ట్
మహబూబాబాద్, జూలై 25(చైతన్యగళం): తాను నీతి అయోగ్ డైరెక్టర్నని చెప్పుకుంటూ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయిస్తానని నమ్మబలికి పలువురి నుంచి సుమారు రూ.1.85 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని మహబూబాబాద్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలం చెర్ల తండాకు చెందిన బోడ మహేష్ (36) ప్రభుత్వ పథకాల పేరుతో, ముఖ్యంగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పిస్తానంటూ బాధితులను నమ్మించి నగదు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలనే సంప్రదించాలని, ఇలాంటి మోసాలకు గురైన వారు లేదా అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.