కల్వకుర్తి, జూలై 21 (చైతన్యగళం):
ప్రపంచ మానవాళి సుఖశాంతులతో జీవించడంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు అష్టైశ్వర్యాలతో జీవించాలని సంకల్పంతో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్ర 91వ విశ్వశాంతి మహాయాగం ఎంతో గొప్పదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ మైదానంలో జరుగుతున్న ఆయుత చండీ అతి రుద్ర మహాయాగంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజ సంభ ఆవిష్కరణలో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ యాగం నిర్వహించడం గొప్ప విషయం. ప్రస్తుతం వర్షాభావంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ యాగం ఫలించి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండించి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ శ్రీ కృష్ణ చైతన్య పరిశుద్ధానంద స్వామి మాట్లాడుతూ, యాగఫలం అందరికీ అందుతుందని, ఆగస్టు 3 వరకు యాగ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో శ్రీ ఆంజనేయ మన్యు పాశుపత హోమాలు, చండీ హోమం, గ్రహ హోమం ప్రత్యేకంగా నిర్వహించగా, సాయంత్రం అభయాంజనేయ స్వామికి లక్ష తమలపాకుల అర్చన, సింధూర అర్చన భక్తిశ్రద్ధలతో జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం నిర్వహించగా, రాత్రి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ మహాయాగంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు, బీచని బాలకృష్ణ, పోలా సురేందర్, జూలూరు ప్రకాష్, రాజేందర్, కల్మిచర్ల గోపాల్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 1500 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు.