CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 11:11 am Posted by : CHAITHANYA GALAM NEWS

నేడు స్వాతి నక్షత్ర గిరిప్రదక్షిణ

యాదగిరిగుట్ట, జూలై 22 (చైతన్యగళం‌):
కోట్లాదిమంది కొంగుబంగారమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మనక్షత్రం స్వాతి. ఈ నెలలో బుధవారం వచ్చిన స్వాతి నక్షత్రం సందర్భంగా గిరిప్రదక్షిణ నిర్వహణకు ప్రత్యేక శోభ ఏర్పడింది.

ఉదయం 6 గంటలకు కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద శ్రీ స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం భక్తులు కీర్తనలు, పాటలు, నామస్మరణతో భజన చేస్తూ కొండ చుట్టూ గిరిప్రదక్షిణ కొనసాగించారు. వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన ప్రదక్షిణ తిరిగి అదే స్థలానికి చేరుకొని, ఆ తర్వాత కొండపైకి వెళ్లి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

“గిరిప్రదక్షిణ చేస్తే కష్టాలు గట్టెక్కుతాయి, కోరికలు తీరుతాయి, సకల శుభాలు కలుగుతాయి” అనే విశ్వాసంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు యాదగిరిగుట్టకు తరలివచ్చారు. ఇటీవల కాలంలో ఈ గిరిప్రదక్షిణకు విశేష ప్రాచుర్యం లభించడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది.