కల్వకుర్తి, జూలై 21 (చైతన్యగళం):
ప్రపంచ మానవాళి సుఖశాంతులతో జీవించాలని సంకల్పిస్తూ కల్వకుర్తిలో జరుగుతున్న శ్రీకృష్ణ కాలచక్ర 91వ విశ్వశాంతి మహాయాగం రెండవ రోజు ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఉదయం శివుని పూజా కార్యక్రమాలు నిర్వహించగా, గోపూజ మహోత్సవం సందర్భంగా గోవులకు పూజలు చేసి యాగశాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. వేదమంత్రాల ఘోషతో యాగశాల ప్రవేశం ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలరించింది. పండితులు వేదపఠనం చేస్తూ హోమాలను ముందుకు నడిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక శోభను ఆస్వాదించారు.ఈ సందర్భంగా శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి రుత్వికులను సమానంగా చేస్తూ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ, “ఆగస్టు 3 వరకు జరిగే హోమాలు, పూజా కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలి” అని సూచించారు.ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుండి రాత్రి వరకు ఆయుత చండి, అతి రుద్రం, ఋగ్వేద–యజుర్వేద–సామవేద–అధర్వణ వేద ఘోష హవనాలు, నవగ్రహ హోమం, నక్షత్రయాగం, శ్రీ సుదర్శన హవనం, సూర్య హోమం, సూర్య నమస్కారాలు, పాశుపతాస్త్ర హోమం, సుబ్రహ్మణ్య హోమం, పుత్రకామేష్టి హోమం, ధన్వంతరి హవనం, లక్ష్మీ గణపతి హోమం, మహాగణపతి హోమం, అష్టలక్ష్మి హోమం, లక్ష్మీనారాయణ హోమం, హనుమత్ హోమం, సరస్వతి హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.ఈ మహాయాగంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ జూలూరు రమేష్ బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచోటి శ్రీశైలం, యాగ నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.