హుజురాబాద్, జూలై 21 (చైతన్యగళం):
విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై లాఠీచార్జ్ చేయడం అత్యంత దురదృష్టకరమని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఆ హక్కును బలప్రయోగంతో అణచివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను వినాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన విమర్శించారు.
“విద్యార్థులను శత్రువుల్లా చూడకుండా, వారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలి” అని పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి అధిక బలప్రయోగానికి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ పోలీసులను ఆయన డిమాండ్ చేశారు.