CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 11:08 am Posted by : CHAITHANYA GALAM NEWS

చైనాలో గోల్డ్ మెడల్ సాధించిన ప్రవళికకు ఉపాధ్యాయుల ఆర్థిక చేయూత

దేవరకొండ, జూలై 21 (నీలగిరి ఎక్స్‌ప్రెస్):
చైనాలోని ఓర్డోస్ నగరంలో ఇటీవల నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026లో భారత మహిళల 4×400 మీటర్ల రిలే జట్టులో పాల్గొని స్వర్ణ పతకం సాధించిన నల్గొండ జిల్లా డిండి మండలం గుండ్లపల్లికి చెందిన యువ అథ్లెట్ నారిమళ్ల ప్రవళికకు స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులు ఘన సత్కారం అందించారు.మంగళవారం ఆర్పీఆర్పీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన అభినందన సభలో మండల పరిధిలోని ఉపాధ్యాయులు ప్రవళిక క్రీడా, విద్య అవసరాల కోసం తమ ఉదారతతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సాధారణ మేస్త్రీ కుటుంబానికి చెందిన ప్రవళిక అంతర్జాతీయ వేదికపై భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్ర కీర్తిని చాటడం గర్వకారణమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎంఈఓ, చెరుకుపల్లి జెడ్పీహెచ్ఎస్ జీహెచ్ఎం ఇస్లావత్ గోప్య నాయక్, తవక్లాపూర్ ఎంపీపీఎస్ హెడ్‌మాస్టర్ డి. రాజేందర్ రెడ్డి, ఎస్జీటీ టీచర్ ముద్దాడ బాలరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. “పేదరికం దేనికీ అడ్డంకి కాదు. పట్టుదల ఉంటే గ్రామీణ విద్యార్థులు కూడా మహానగర విద్యార్థులకు పోటీ ఇవ్వగలరు” అని వారు వివరించారు.అంతర్జాతీయ విజేతగా నిలిచిన ప్రవళిక తల్లిదండ్రులు రాంబాబు–విజయ దంపతులను ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే ఈ విజయానికి సహకరించిన కోచ్ పరుశురాం, పీఈటీ జ్యోతి, ఇంచార్జ్ వైస్ ప్రిన్సిపాల్ నాగమణి, ఉపాధ్యాయురాలు మంగలను కూడా శాలువాలతో గౌరవించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు లింగిరి సత్యనారాయణ, పల్లె వెంకటయ్య, ఎస్టీయూటీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భూక్య నాగేశ్వరరావు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గొడుగు శ్రీనివాస్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.