కరీంనగర్, జూలై 21 (చైతన్యగళం):
కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడిగా గడ్డం విలాస్ రావు ఎన్నికయ్యారు.
ప్రభుత్వ జీవో ద్వారా కమిటీని నియమించినప్పటికీ, ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో రాజశేఖర్ ప్యానెల్ విజయం సాధించింది. అయితే ఎన్నికలు సక్రమంగా జరగలేదని, బ్యాంక్ బైలా మరియు 1964 సహకార చట్టం ప్రకారం ఉల్లంఘనలు జరిగాయని వాదిస్తూ వరంగల్ సహకార ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి, ఎన్నికైన కమిటీపై స్టే ఇచ్చి, వివాదాస్పద ఎన్నికలకు ముందున్న పీఏసీ కమిటీని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ ఉత్తర్వుల ప్రకారం జూలై 7న కమిటీ బాధ్యతలు స్వీకరించింది. మార్చి 31లోపు సర్వసభ్య సమావేశం జరగడంతో, బైలా ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఆ కార్యవర్గం ఆటోమేటిక్గా రద్దు అవుతుందని గడ్డం విలాస్ రావు వివరించారు. దీనిపై సహకార అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. హైకోర్టు గత నెల 23న సహకార అధికారులకు ఆయన రిప్రజెంటేషన్ను పరిగణలోకి తీసుకొని, నాలుగు వారాల లోపు పీఏసీ కమిటీని లేదా అధికారిక కమిటీని నియమించాలని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలను అధికారులు ఆమోదించడంతో, ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం ఇప్పటికే కమిటీ పదవిలో కొనసాగుతోందని, జిల్లా మంత్రుల పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జ్ వేలుచాలా రాజేంద్ర రావు సూచనలతో బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామని గడ్డం విలాస్ రావు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మడుపు మోహన్, లక్ష్మణ్ రాజు, అలుగు విద్యాసాగర్, ముక్క భాస్కర్, సందీప్, నాగుల సతీష్, మార్కా రాజు తదితరులు పాల్గొన్నారు.