- రాహుల్–ప్రియాంక అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, జూలై 22 (చైతన్యగళం):
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా మిర్యాలగూడలో భారీ ఆందోళన కార్యక్రమం జరిగింది.ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి, కేంద్ర ప్రభుత్వంపై నినాదాలు చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ప్రతిపక్షాల గొంతును అణచివేయడం అత్యంత దురదృష్టకరం. రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే” అని తీవ్రంగా విమర్శించారు.కాంగ్రెస్ నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ప్రజా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసనలో పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, యువజన–మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.