CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 11:13 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఓటరు జాబితా ప్రక్షాళనపై బీజేపీ కీలక సమీక్ష

కరీంనగర్, జూలై 21 (చైతన్యగళం):
కరీంనగర్ నగరంలోని 40 డివిజన్లలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రక్షాళన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, పోలింగ్ బూత్ బాధ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి యువతీయువకుడికి ఓటు హక్కు కల్పించేలా బూత్ స్థాయి కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. జాబితాలో ఎలాంటి లోపాలు, డూప్లికేట్ ఓట్లు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో ఒక్క అర్హుడి ఓటు తొలగిపోకుండా, అనర్హుల పేర్లు చేరకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి” అని అన్నారు. మేయర్ కోలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, “నగర అభివృద్ధిలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటూ కీలకమే. 40 డివిజన్లలో ఈ ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగడం అభినందనీయం” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వివిధ డివిజన్ల బాధ్యులు తమ ప్రాంతాల్లోని ఓటరు జాబితా స్థితిగతులను పార్టీ నాయకత్వానికి వివరించారు.