పెద్దపల్లి, జూలై 21 (చైతన్యగళం):
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల శివారులో నక్కల ఓర్రెపై రూ.50 లక్షల నిధులతో బ్రిడ్జి, మీర్జాంపేట–తారుపల్లి మధ్య రూ.1.55 కోట్ల నిధులతో బ్రిడ్జి, వ్యవసాయ మార్కెట్ భవనం & ప్రహరీ నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులు, మహిళా భవనం నిర్మాణానికి రూ.10 లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, తారుపల్లిలో గ్రామ పంచాయతీ ప్రహరీ నిర్మాణానికి రూ.20 లక్షలు, కల్వర్టు నిర్మాణానికి రూ.15 లక్షలు, పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.23 లక్షలు, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.40 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
అనంతరం పెద్దరాతుపల్లి గ్రామంలో హుజురాబాద్–జమ్మికుంట నుంచి గోదావరిఖనికి వెళ్లే బస్సు సేవలను జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా బస్సు నడిపి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ బస్సు మండలంలోని ఇడులాపూర్, పెద్దరాతుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, మొట్లపల్లి, మీర్జాంపేట, కిష్టంపేట గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కేవలం మెదక్, గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాలకే తరలించిందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. “ఉమ్మడి జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ ద్వారానే నీళ్లు అందుతున్నాయి. కాళేశ్వరం కూలిపోవడానికి నాటి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలే కారణం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అవసరమైతే రీ-కన్స్ట్రక్షన్ చేస్తాం. తుమ్మిడిహట్టి ద్వారా నీటిని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం కృషి చేస్తుంది” అని స్పష్టం చేశారు.
ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని రైతులు ముందుజాగ్రత్తగా పంటల మార్పిడి పాటించాలని సూచించారు. “నాలుగు ఎకరాలు ఉన్న రైతులు రెండు ఎకరాల్లో వరి వేసి, మిగతా భూమిలో కంది, నువ్వులు, వేరుశనగ వంటి ఆరుతడి పంటలు వేసుకోవాలి” అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. DAP కి బదులుగా సూపర్, నానో ఎరువులు వాడటం పంటలకు లాభదాయకమని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, తహసిల్దార్ రాపెల్లి రాముడు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మార్కెట్ డైరెక్టర్లు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.