న్యూఢిల్లీ–పెద్దపల్లి, జూలై 21 (చైతన్యగళం):
జంతర్మంతర్ వద్ద నిర్వహించిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరసనలో పాల్గొన్న పిల్లలు, మహిళలు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు గ్యాస్ బాంబులు ప్రయోగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా, బాధితులు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఆర్ఎంఎల్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.
ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, “పిల్లలు, మహిళలు, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై పోలీసులు ఈ విధంగా దాడులు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ఆ హక్కులను అణచివేసే విధంగా పోలీసులు వ్యవహరించడం సరికాదు” అని అన్నారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, వారికి అవసరమైన అన్ని విధాలా అండగా ఉంటామని ఎంపీ భరోసా ఇచ్చారు.