- అజీమ్ ప్రేమ్జీ స్ఫూర్తితోనే పేదరికం దూరం
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
- విద్యార్థినీలకు అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ పత్రాలు అందజేత
పెద్దపల్లి,జూలై 20(చైతన్య గళం):
ఢిల్లీకి మూటలు మోసే నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యతలో కనీసం ఒక్క శాతం కేటాయించినా పేద విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష సౌజన్యంతో ఏర్పాటు చేసిన అభినందన సభలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సుల్తానాబాద్ మహిళా కళాశాల, పెద్దపల్లి మదర్ థెరిస్సా ఇంజినీర్ కళాశాల, మంథని రోష్ని డిగ్రీ కళాశాల,సుల్తానాబాద్ శ్రీ వాణి డిగ్రీ కళాశాల,పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కళాశాల,పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన దాదాపు 120 మంది విద్యార్థినీలకు అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ల పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత కుబేరుడైన అజీమ్ ప్రేమ్జీ తన సంపాదనలో కొంత భాగాన్ని పేద విద్యార్థుల,ముఖ్యంగా అమ్మాయిల ఉన్నత చదువుల కోసం వెచ్చించడం అభినందనీయమని కొనియాడారు.కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం పేద ప్రజలకు దారబోసే గొప్ప మనసు ఆయనది అని,పెద్దపల్లి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ వ్యాప్తంగా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సిన రూ.12వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా,హైకోర్టును ఆశ్రయించి యాజమాన్యాలే నేరుగా విద్యార్థుల నుండి వసూలు చేసుకోవాలని ప్రభుత్వం వాదించడం సరికాదన్నారు.బర్లు కాసుకునే కుటుంబాలు,వ్యవసాయ కూలీలు,సన్నకారు రైతుల బిడ్డలు సాంకేతిక,వైద్య రంగాలలో ఉన్నత చదువులు చదవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎంతగానో ఉపయోగపడిందని గుర్తుచేశారు.గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించి,కేసీఆర్ అద్భుతంగా కొనసాగించిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం భారం మోయలేమంటూ పక్కన పెట్టడం పేద విద్యార్థుల గొంతు కోయడమేనని విమర్శించారు.పేద విద్యార్థుల చదువులను రోడ్డున పడేసే ఈ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు,ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉష,బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్,జిల్లా మహిళా అధ్యక్షురాలు సిరవేణి మీడియా ఇంచార్జ్ ఎండి.మాలిక్ వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి శ్రీనివాస్, రవీందర్, కమలాకర్,కళాశాలకు చెందిన 120 మంది విద్యార్థినీలు,తదితరులు పాల్గొన్నారు.