CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:10 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పేదల చికిత్సకు ఎల్వోసి అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్

నిజామాబాద్, జూలై 18 (చైతన్యగళం):
నియోజకవర్గంలోని అవసరమైన వారికి నిమ్స్‌లో చికిత్స పొందేందుకు ఎల్వోసి అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.

శనివారం నగరంలోని కార్యాలయంలో ఎల్వోసి అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్వోసి ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నాను” అని పేర్కొన్నారు.

గాజులపేటకు చెందిన తోక శ్రావణ్ కుమార్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, నిమ్స్‌లో చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్వోసి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. “పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే నా లక్ష్యం” అని ఎమ్మెల్యే ధన్‌పాల్ స్పష్టం చేశారు.

అలాగే హైదరాబాద్‌లోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన వారు ఎయిమ్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లతో నిర్మించిన ఈ ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్కాయి మహేందర్, నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, ప్రసూన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.