కరీంనగర్, జూలై 18 (చైతన్యగళం):
కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో రూ.1.18 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కలిసి శుక్రవారం భూమిపూజలు, శంకుస్థాపనలు నిర్వహించారు.
38వ డివిజన్ పరిధిలోని పద్మశాలి సంఘం వెళ్లే దారిలో రూ.70 లక్షల యూడీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ జరగగా, 3వ డివిజన్ పరిధిలోని విద్యారణ్యపురి రోడ్ నెం.2లో రూ.48.50 లక్షల యూడీఎఫ్ నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, “ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. నగర పాలక సంస్థతో సమన్వయం చేసుకుంటూ కరీంనగర్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నాం. నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా, మెరుగైన జీవన వాతావరణం కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం” అని అన్నారు.
నగర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, కార్పొరేటర్లు దేవసాని సరస్వతి, సత్యనారాయణ, సాదినేని లావణ్య, మునిందర్, మున్సిపల్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.