CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 7:48 pm Posted by : rakeshkashaveni12@gmail.com

కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు

సిరిసిల్ల, జూలై 17 (చైతన్య గళం):

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కాన్వాయ్‌కు శుక్రవారం సిరిసిల్ల జిల్లాలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్ గ్రామం నుంచి గంభీరావుపేటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న కాన్వాయ్ వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాల ముందు, వెనుక భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

అయితే ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న నాయకులు, భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదం అనంతరం బండి సంజయ్ మరో వాహనంలో తన తదుపరి పర్యటనకు బయలుదేరారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, వెంటనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.