CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 7:46 pm Posted by : rakeshkashaveni12@gmail.com

సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య శిబిరం

  • 35 మంది వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ

కరీంనగర్, జూలై 17 (చైతన్య గళం):

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ప్రణామం డే కేర్ సెంటర్‌లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష సీనియర్ సిటిజన్లకు ఉచితంగా రక్తంలో చక్కెర (షుగర్), రక్తపోటు (బీపీ) పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో సుమారు 35 మంది వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ ప్రత్యూష, ఆశా వర్కర్లు, ప్రణామం డే కేర్ సెంటర్ సిబ్బందికి తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జనాపాల శంకరయ్య, జిల్లా కోశాధికారి దొంత దేవదాస్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ సీనియర్ సిటిజన్లకు సేవలు అందిస్తున్న వైద్య బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నిరంతర సేవలు కొనసాగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, గౌరవ సభ్యులు, ఆశా వర్కర్లు, డే కేర్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.