CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 8:50 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రంగారెడ్డి, జూలై 17 (చైతన్యగళం): ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శివరాంపల్లి కాన్ఫరెన్స్ హాల్‌లో అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయి హాజరై, జనాభా మార్పులు, కుటుంబ సంక్షేమం, మహిళల ఆరోగ్యం, తల్లి‑శిశు సంరక్షణ వంటి అంశాలపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. “అనవసర గర్భధారణలను నివారించడం, ప్రసవాల మధ్య తగిన విరామం పాటించడం ద్వారా తల్లి‑శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన కుటుంబమే సమాజ అభివృద్ధికి పునాది” అని ఆమె పేర్కొన్నారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ స్వర్ణ కుమారి మాట్లాడుతూ, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల విజయవంతమైన అమలులో వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల పాత్ర కీలకమని అన్నారు. “ప్రతి గర్భిణిని నమోదు చేసి, తల్లి‑శిశు ఆరోగ్య సేవలు అందించడం, కుటుంబ నియంత్రణపై నిరంతర అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది” అని వివరించారు.కార్యక్రమం ముగింపులో విశిష్ట సేవలందించిన వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయి ప్రశంసా పత్రాలు, అవార్డులు ప్రదానం చేశారు. ఈ గుర్తింపు తమలో మరింత బాధ్యత, ఉత్సాహాన్ని నింపిందని అవార్డు గ్రహీతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డా. షీబా హయాత్, డా. రాధిక, డా. పాపారావు, డా. రాకేష్, డా. జ్యోతిబాయి, డెమో మంజుల ,మాస్ మీడియా అధికారి కె. శ్రీనివాసులు తో పాటు వైద్యాధికారులు, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.