CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 5:53 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే బాలు నాయక్

దేవరకొండ, జూలై 16 (చైతన్యగళం):
దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ, “నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం నా ప్రధాన లక్ష్యం. గ్రామీణ నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా ఉండేలా సూచనలు ఇచ్చాను” అని తెలిపారు.ఆయన పేర్కొంటూ, “ప్రస్తుతం ఉన్న తాగునీటి పరిస్థితి, పైప్‌లైన్ల నిర్వహణ, మోటార్ల పనితీరు, నీటి నిల్వ సామర్థ్యం, లీకేజీల నివారణ, మరమ్మతులు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించాం. వేసవి కాలంలోనే కాదు, ఇతర సమయాల్లో కూడా ప్రజలకు ఎలాంటి మంచినీటి కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలి. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి” అని ఆదేశించారు.ఎమ్మెల్యే బాలు నాయక్ స్పష్టం చేస్తూ, “మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు నిరంతరాయంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. దేవరకొండ నియోజకవర్గంలో ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య లేకుండా చూడటమే నా లక్ష్యం” అని అన్నారు.ఈ సమీక్ష సమావేశంలో గ్రామీణ నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ శాఖకు చెందిన సంబంధిత అధికారులు పాల్గొన్నారు.