హయత్నగర్, జూలై 16 (చైతన్యగళం):
రంగారెడ్డి జిల్లా డిసిహెచ్ఎస్ డా. అనురాగిణి రెడ్డి గురువారం హయత్నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు.
ఆసుపత్రి ఓపీడి, ఐపీడి వార్డులు, ల్యాబ్, ఫార్మసీ, ప్రసూతి వార్డు, 108 అంబులెన్స్ సేవలు, శానిటేషన్, డైట్ సౌకర్యాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న ఉచిత మందులు, పరీక్షల సౌకర్యం, సిబ్బంది హాజరు రిజిస్టర్, బయోమెట్రిక్ హాజరు, రోగుల ఫీడ్బ్యాక్ రిజిస్టర్ను కూడా తనిఖీ చేశారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డా. అనురాగిణి రెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి గౌరవంగా, నాణ్యమైన వైద్యం అందించాలి. మందుల కొరత లేకుండా చూడాలి. అన్ని రకాల పరీక్షలు చేయాలి. సిబ్బంది సమయపాలన పాటించాలి. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి, దోమల నివారణ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో అందేలా చూడాలి” అని ఆదేశించారు.
ఆమె స్పష్టం చేస్తూ, “ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ విషయంలో రాజీ పడదు. వైద్య సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వహించరాదు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీహెచ్ సీ సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.