CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 4:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఈనెలలోనే 50 నామినేటెడ్ పోస్టుల భర్తీ-మహేశ్ గౌడ్

నామినేటెడ్ పదవులపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెలలో 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్, జులై 15(చైతన్యగళం): ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈరోజు(బుధవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గతంలో పనితీరు కనబరిచిన వారిని రెన్యూవల్ చేసే అవకాశం ఉందన్నారు. డీసీసీల పనితీరు బాగోలేకపోతే మార్చే అవకాశం ఉందని వెల్లడించారు. పార్టీ పదవులపై మీనాక్షి నటరాజన్‌తో చర్చించామని తెలిపారు. రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అవుతామన్నారు. రెన్యువల్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మండల కమిటీలో డీసీసీల రిపోర్ట్ ఫైనల్ అని స్పష్టం చేశారు.

ఎంపీ రేణుకా చౌదరితో మాట్లాడానని మహేశ్ తెలిపారు. ‘తాను మాట్లాడిన ఉద్దేశం వేరని నాతో అన్నారు. ఖమ్మంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నాయని అన్నట్లు రేణుక నాతో చెప్పారు.. కానీ ఆ వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేశారు’ అని తెలిపారు. కూనంనేని మిత్రపక్షం అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ క్యాడర్ కూడా ఉందన్నారు. దానిని కాపాడుకునే ప్రయత్నంలో ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడి ఉంటారని చెప్పుకొచ్చారు. కూనంనేనితో తమకెలాంటి విభేదాలూ లేవన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రతి చిన్న విషయానికీ గాంధీభవన్‌ రావటం మానుకోవాలని క్యాడ‌ర్‌కు సూచించారు. నలుగురు ఐదుగురు మినహా అందరు డీసీసీ అధ్యక్షుల పనితీరు బాగుందని మహేశ్ గౌడ్ కితాబిచ్చారు.