- స్వయం ఉపాధి దిశగా మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి
- ఆర్థిక స్వావలంబనకు ఉచిత నైపుణ్య శిక్షణలు ఎంతో ఉపయోగకరం
- మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య
- శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా తాటికొండ రాజయ్యను ఆహ్వానించిన తెలంగాణ మహిళా సంఘం అధ్యక్షురాలు దొనికెన పద్మ
హైదరాబాద్, జులై 14(చైతన్యగళం): మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మహిళల సాధికారతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కీలకమని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
తెలంగాణ మహిళా సంఘం అధ్యక్షురాలు దొనికెన పద్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన మహిళలకు ఈనెల 19వ తేదీ తెలంగాణ భవన్లో సర్టిఫికెట్లు అందజేసే ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆమె తాటికొండ రాజయ్యను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమం లక్ష్యాలు, మహిళల కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించారు.
ఆహ్వానాన్ని స్వీకరించిన తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, మహిళలు విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలను కూడా అలవరచుకుంటే కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. నేటి పరిస్థితుల్లో స్వయం ఉపాధే మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే ఉత్తమ మార్గమని అన్నారు.
దొనికెన పద్మ మాట్లాడుతూ, కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించామని తెలిపారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేయడం ద్వారా వారి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమానికి తాటికొండ రాజయ్య హాజరు కావడం మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు.