పాలకుర్తి, జూలై 14 (చైతన్యగళం):
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం సాయి తిరుమల్ (28) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. గ్రామంలోని ఐకేపీ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఆయన, సామాగ్రి తీసుకురావడానికి వెళ్తుండగా బైక్ ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయాలయ్యాయి.
కోమాలోకి వెళ్లిన సాయి తిరుమల్ 20 రోజులు పాటు హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందినా ప్రాణాలు నిలవలేదు. కుటుంబం 15 లక్షలు అప్పుచేసి చికిత్స అందించినా ఒక్కగానొక్క కొడుకును కోల్పోవడంతో తల్లిదండ్రులు, స్నేహితులు రోదనలు మిన్నంటాయి.
సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరగడంతో స్పందించిన దాతలు విరాళాల రూపంలో ఆర్థిక సహాయం అందించారు. అయినా సాయి తిరుమల్ ప్రాణాలు దక్కకపోవడంతో గ్రామం దుఃఖసాగరంలో మునిగిపోయింది. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రమాదానికి కారణమైన వివరాలను బసంతనగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.