కరీంనగర్, జూలై 14 (చైతన్యగళం): తెలంగాణ ఉద్యమ అమరవీరుడు, దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం కరీంనగర్లో పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్, కిష్టయ్య సతీమణి పద్మావతి, కుమారుడు రాహుల్, కోడలు వర్ష, కుమార్తె డాక్టర్ ప్రియాంకతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జన్మించిన కిష్టయ్య మనవడు వేదాంత్ రాఘవ కిష్టయ్యను ఆశీర్వదించి, వస్త్రాలు, కానుకలు అందజేశారు. అదనంగా, కిష్టయ్య పేరులో ‘కె’ అక్షరంతో ప్రత్యేక లాకెట్ను బహూకరించి, కేసీఆర్ కిట్ను అందించారు.
కిష్టయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక మెడిసిన్ పీజీ విద్యాభ్యాసం కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సాయంలో భాగంగా ఫీజుల చెక్కును కేటీఆర్ అందజేశారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు ఆత్మీయంగా గడిపిన ఆయన, “అమరవీరుడు కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని భరోసా ఇచ్చారు.
కేటీఆర్ చూపిన ఆప్యాయత, ఆదరణతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురై, తమ ఇంటికి వచ్చి పరామర్శించి, మనవడిని ఆశీర్వదించి, కుమార్తె విద్యకు ఆర్థిక సాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, డా. సంజయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.