CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 9:40 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి – కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, జూలై 13 (చైతన్యగళం):
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.సోమవారం చెన్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, తహసీల్దార్ మల్లికార్జున్తో కలిసి డిజిటలైజేషన్ పనులను పరిశీలించారు. ఈ నెల 24లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఫారాల సేకరణలో ఏజెంట్ల సహకారం తీసుకోవాలని, నింపిన వివరాలను బి.ఎల్.ఓ యాప్లో స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.అర్హత గల ఓటర్లు స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, పొరపాట్లకు తావు లేకుండా జాబితా సవరణ జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు.తరువాత ఆయన చెన్నూర్‌లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, గిరిజన సంక్షేమ వసతి గృహం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, వెనుకబడిన తరగతుల వసతి గృహం, అమృత్ 2.0 నీటి ట్యాంక్ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.“ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం, పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించడమే లక్ష్యం. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి” అని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.