CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 6:07 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జిల్లా బీజేపీ సమావేశంలో కీలక తీర్మానాలు

కరీంనగర్ (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా బీజేపీ విస్తృత స్థాయి సమావేశం గంగాధర మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ముఖ్య అతిథి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి శాంతి కుమార్ మాట్లాడుతూ – కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతోందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఇసుక మాఫియా, రైతు సమస్యలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఇచ్చిన హామీలపై మాట తప్పడం వంటి అంశాలను సమావేశంలో ఎండగట్టారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతోందని, ముఖ్యంగా జాతీయ రహదారులు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్, ఈజీఎస్ నిధులు ద్వారా జిల్లా ముఖచిత్రం మారుతోందని సమావేశం హర్షం వ్యక్తం చేసింది.

జిల్లా బీజేపీ శాఖ ప్రవేశపెట్టిన తీర్మానాలను మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మేయర్ కోలగాని శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి తదితరులు బలపరిచారు.

“కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కేంద్ర పథకాలను బలంగా ప్రచారం చేస్తూ ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో కరీంనగర్ జిల్లాను ముందుంచుతాం” అని జిల్లా బీజేపీ శాఖ స్పష్టం చేసింది.