CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 7:41 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యత – ఎమ్మెల్యే కౌశిక్

వీణవంక, జూలై 10 (చైతన్యగళం):

వీణవంక మండలం చల్లూర్ గ్రామంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాల, అంగనవాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల హాజరు, బోధన విధానం, తరగతి గదుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం నాణ్యత, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య పరిస్థితులు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అంగనవాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పోషకాహారం, నమోదు వివరాలు, నిర్వహణను కూడా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ – “ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ బాధ్యత. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు.