CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 9:30 pm Posted by : rakeshkashaveni12@gmail.com

పెండింగ్ సీసీసీ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి – సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ , జూలై 9(చైతన్యగళం):

ప్రజల నుంచి అందుతున్న సీసీసీ (CCC) ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు.

గురువారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో హుజురాబాద్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పెండింగ్‌లో ఉన్న సీసీసీ ఫిర్యాదుల పురోగతిని ఆయన సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా విధులు నిర్వహించాలని సీపీ గౌష్ ఆలం సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, సీఐలు కరుణాకర్, వెంకట్, రామకృష్ణ, ఎస్సైలు శేఖర్, క్రాంతి, స్వాతితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.