CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 10:46 pm Posted by : rakeshkashaveni12@gmail.com

జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు రాష్ట్ర స్థాయికి విజేతల ఎంపిక

కరీంనగర్, జూలై 8(చైతన్యగళం):

జోన్-III పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల పోలీసు సిబ్బంది కోసం నిర్వహించిన జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ విజయవంతంగా ముగిసింది. పోలీసు సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఫింగర్ ప్రింట్స్, సైబర్ అవగాహన, క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ, సెర్చ్ ఆపరేషన్స్ తదితర 21 విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు.

వివిధ విభాగాల్లో కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీసు కానిస్టేబుళ్లు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. పోలీస్ పోర్ట్రైట్, అబ్జర్వేషన్, వెహికల్ సెర్చ్, రూమ్ సెర్చ్, గ్రౌండ్ సెర్చ్, యాక్సెస్ కంట్రోల్, ట్రాకింగ్, పేలుడు పదార్థాల శోధన, నార్కోటిక్స్, కంప్యూటర్ అవేర్‌నెస్, ఆఫీస్ ఆటోమేషన్, ప్రోగ్రామింగ్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పోలీస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో విజేతలను ప్రకటించారు.

డ్యూటీ మీట్‌లో ప్రథమ స్థానాలు సాధించిన విజేతలు త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో జోన్-III తరపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. విజేతలను ప్రత్యేకంగా అభినందించిన ఆయన, ఇలాంటి పోటీలు పోలీసు శాఖలో నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్ జి., వేణుగోపాల్, వెంకటస్వామి, వివిధ జిల్లాల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.