కరీంనగర్, జూలై 8(చైతన్యగళం):
కరీంనగర్ జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న వెండి ఫిలిగ్రీ తయారీ యూనిట్లను అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణలో పి. హరి ప్రసాద్ బుధవారం సందర్శించారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. స్వరూపారాణితో కలిసి సప్తగిరి కాలనీ, అశోక్నగర్ ప్రాంతాల్లోని యూనిట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా వెండి ఫిలిగ్రీ కళాఖండాల తయారీ విధానం, మహిళలకు లభిస్తున్న ఉపాధి అవకాశాలు, ఉత్పత్తుల మార్కెటింగ్, ఆదాయ వృద్ధిపై సభ్యులతో చర్చించారు. కరీంనగర్ వెండి ఫిలిగ్రీ కళకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని హరి ప్రసాద్ పేర్కొన్నారు. మెప్మా ద్వారా మార్కెట్ అవకాశాలను విస్తరించి మహిళల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. స్వరూపారాణి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత కోసం నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ అనుసంధానం, ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వెండి ఫిలిగ్రీ ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించి మహిళలకు స్థిరమైన జీవనోపాధి అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.