- వేలాది మంది భక్తులు నిత్యం దర్శించే పుణ్యక్షేత్రానికి రహదారి కూడా కరువు
- కోట్లాది రూపాయల భవనాలకు నిధులు… భక్తుల కోసం కొన్ని కిలోమీటర్ల రోడ్డు మాత్రం లేదా?
వనపర్తి, జూలై 7 (చైతన్యగళం): ప్రభుత్వాలు ప్రజలకు సేవలందించేందుకు కోట్లాది రూపాయలతో కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, అధికారుల నివాస సముదాయాలు నిర్మిస్తున్నా… వేలాది మంది భక్తులు నిత్యం దర్శించే వనపర్తి సమీపంలోని తిరుమలయ్య గుట్ట మాత్రం నేటికీ కనీస మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తోంది. ప్రధాన రహదారి నుంచి కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దర్శనమే దుర్భర ప్రయాణం
తిరుమలయ్య గుట్టకు వెళ్లే దారి గుంతలు, రాళ్లు, మట్టి మార్గంతో ప్రమాదకరంగా మారింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో బురద, నీటి నిల్వల కారణంగా పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. భక్తి కోసం వచ్చే ప్రజలు ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరమని స్థానికులు అంటున్నారు.

ప్రకృతి ఒడిలో పవిత్ర క్షేత్రం
అరుదైన ఔషధ మొక్కలు, సుసంపన్నమైన వృక్ష సంపద, ప్రశాంతమైన వాతావరణంతో తిరుమలయ్య గుట్ట ప్రత్యేక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందింది. నిత్యం వందలాది మంది, ప్రత్యేక రోజుల్లో వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. అయినప్పటికీ తాగునీరు, విద్యుత్, విశ్రాంతి షెడ్లు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి కనీస సదుపాయాలు కూడా లేకపోవడం విచారకరం.
భక్తులే భరోసా…
ప్రతి నెల 7వ తేదీన భక్తులు స్వచ్ఛందంగా అల్పాహార పంపిణీ, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సహాయం లేకపోయినా భక్తులు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ క్షేత్ర మహిమాన్వితాన్ని కాపాడుతున్నారు. కానీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు మాత్రం ఈ క్షేత్రాన్ని పట్టించుకోకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని కిలోమీటర్ల రోడ్డు… కోట్లాది భక్తులకు ఉపశమనం
కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర నాణ్యమైన రహదారి నిర్మిస్తే వేలాది మంది భక్తులకు సౌకర్యం కలుగుతుంది. తాగునీటి సదుపాయం, విద్యుత్ దీపాలు, విశ్రాంతి మండపాలు, పారిశుద్ధ్య వసతులు కల్పిస్తే తిరుమలయ్య గుట్ట ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశముంది. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది.
ఇకనైనా స్పందించాలి
గ్రామీణాభివృద్ధి శాఖ, రెవెన్యూ శాఖ, వనపర్తి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తిరుమలయ్య గుట్టకు శాశ్వత రహదారి నిర్మించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దేవాలయాల అభివృద్ధి అంటే కేవలం పెద్ద పుణ్యక్షేత్రాలకే పరిమితం కాకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న స్థానిక ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత. “భక్తి ఉన్న చోట భద్రత ఉండాలి… తిరుమలయ్య గుట్టకు రహదారి ఎప్పుడు?” అనే ప్రశ్నకు పాలకులు, అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.