కరీంనగర్, జూలై 6 (చైతన్యగళం):
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా క్యాంపు కార్యాలయం నుంచి సమావేశంలో పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని, రాష్ట్రవ్యాప్తంగా రేపటిలోగా 100 శాతం పంపిణీ పూర్తి చేయాలని సీఈఓ ఆదేశించారు. పంపిణీ చేసిన ప్రతి ఫారాన్ని బీఎల్వోలు తిరిగి సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని, తప్పుడు సమాచారం అందించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలు మాత్రమే పంపిణీ చేయాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులు లేదా బీఎల్ఏలు పంపిణీ చేయరాదని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ పనులు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితర అధికారులు పాల్గొన్నారు.