రంగారెడ్డి, జూలై 6 (చైతన్యగళం):
ప్రపంచ జూనోటిక్ వ్యాధుల దినోత్సవం (World Zoonoses Day) సందర్భంగా సోమవారం రంగారెడ్డి జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. స్వర్ణకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, “వన్ హెల్త్ (One Health) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా జూనోటిక్ వ్యాధులను నివారించవచ్చు” అని తెలిపారు. వైద్య, పశుసంవర్ధక, అటవీ, పర్యావరణ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే ప్రజారోగ్యం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
జిల్లా మలేరియా అధికారి డా. రాకేష్, జిల్లా సర్వైలెన్స్ అధికారి డా. వినోద్, ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. పూనమ్ జూనోటిక్ వ్యాధులపై పర్యవేక్షణ, ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలు, బయోసెక్యూరిటీ అమలు, అనుమానిత కేసులను వెంటనే నివేదించడం వంటి అంశాలపై సిబ్బందికి వివరించారు.
కార్యక్రమంలో భాగంగా వన్ హెల్త్, వ్యాధి పర్యవేక్షణ (Surveillance), టీకాల ప్రాధాన్యత, పరిశుభ్రత, బయోసెక్యూరిటీ, మరియు సమాజంలో అవగాహన పెంపు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారులు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అధికారులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు జంతువులతో వ్యవహరించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.