CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 11:13 pm Posted by : rakeshkashaveni12@gmail.com

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం విజయవంతం చేయాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, జూలై 6 (చైతన్యగళం ):

జిల్లాలో ఈ నెల 13న నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు.

సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రల పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక–మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

జూలై 13న మాత్రలు తీసుకోలేని పిల్లలకు జూలై 20న మలి విడత కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 2,59,365 మంది పిల్లలకు 924 పాఠశాలలు, 66 జూనియర్ కళాశాలలు, 777 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆశాలు, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.