జగిత్యాల, జూలై 4 (చైతన్య గళం):
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం జగిత్యాల జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు బీజేపీ కార్యకర్తకు ఆర్థిక సాయం అందించి, ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు పార్టీ నాయకులను పరామర్శించారు.
ఉదయం మేడిపల్లి మండల కేంద్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి, మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం భీమారం మండల కేంద్రంలో ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన బస్టాండ్ను ప్రారంభించారు. అక్కడి నుంచి కథలాపూర్ మండలానికి వెళ్లి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
పర్యటనలో భాగంగా సిరికొండలో ఇటీవల అగ్నిప్రమాదంలో పామాయిల్ తోట పూర్తిగా కాలిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీజేపీ కార్యకర్త ప్రమోద్ ఇంటికి వెళ్లిన బండి సంజయ్ ఆయనకు ఆర్థిక సాయం అందించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం జగిత్యాల పట్టణంలో బీజేపీ నాయకుల ఆహ్వానం మేరకు పలువురు కార్యకర్తల నివాసాలకు వెళ్లిన కేంద్ర మంత్రి, బీజేపీ పట్టణాధ్యక్షుడు కొక్కు గంగాధర్ తల్లి మృతికి సంతాపం తెలిపారు. అలాగే బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్ తండ్రి, ప్రముఖ న్యాయవాది సర్వ గంగాధర్ తండ్రి మృతిపట్ల వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
జగిత్యాల నుంచి మల్యాలకు వెళ్లిన బండి సంజయ్, ఇటీవల మృతి చెందిన బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు నేరెళ్ల శ్రవణ్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి తన సానుభూతిని తెలియజేశారు.