CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 8:11 pm Posted by : rakeshkashaveni12@gmail.com

వానాకాల సన్నద్ధతపై సీఎస్ సమీక్ష

సిద్దిపేట, జూలై 4 [చైతన్యగళం]:

రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలి – సీజనల్ వ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండాలి

వానాకాలం–2026 వ్యవసాయ సీజన్‌ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, ప్రజారోగ్యం, విద్య, ఉద్యానవనం, ఆయిల్ పామ్ విస్తరణ, రైతు రిజిస్ట్రీ, సూక్ష్మ సాగునీరు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై సమీక్షించారు.

రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రైతు రిజిస్ట్రీ నమోదు వేగవంతం చేయడంతో పాటు పంటల వైవిధ్యీకరణ, ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతతో అమలు చేయాలని, ఫేషియల్ రికగ్నిషన్, డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎస్ ఆదేశాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తామని, రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంతో పాటు రైతు రిజిస్ట్రీ నమోదు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధుల నివారణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.