CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 11:16 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు

మహబూబాబాద్(చైతన్యగళం): మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని నేతాజీ సేవాసమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నేతాజీ సేవాసమితి వ్యవస్థాపకుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు ధీటుగా ఎదిరించి గిరిజనుల హక్కులు, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. దేశభక్తి, ధైర్యసాహసాలు, క్రమశిక్షణ వంటి విలువలను యువత అలవరచుకుని అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు భారత సైన్యంలో చేరి దేశసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవభావాన్ని పెంపొందించుకోవడంతో పాటు సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని యువతకు సూచించారు. అల్లూరి త్యాగం, పోరాట స్ఫూర్తి భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నేతాజీ సేవాసమితి ప్రధాన కార్యదర్శి కుదురుపాక వివేక్, ఆర్గనైజింగ్ కన్వీనర్ సామ శ్రీనివాస్, సభ్యులు చిట్టిమల్ల రఘు, శ్రీరంగం శోభన్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిజు పీటర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.