CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 5:40 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థినుల్లో నాయకత్వ వికాసానికి ‘వాయిస్–4 గర్ల్స్’

  • ప్రభుత్వ ఎస్టీ గురుకులంలో 10 రోజుల శిక్షణ విజయవంతం

ఆమనగల్లు, జూలై 4 (చైతన్యగళం): విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించాలనే లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల (Govt STGH), ఆమనగల్లులో నిర్వహించిన ‘వాయిస్–4 గర్ల్స్’ శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. జూన్ 24 నుంచి జూలై 4 వరకు పది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో *‘సఖి పీర్ గ్రూప్ లీడర్స్’*గా ఎంపికైన విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలు, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, జీవన నైపుణ్యాలు, లింగ సమానత్వం, హక్కులు, బాధ్యతలు వంటి కీలక అంశాలపై సమగ్ర శిక్షణ అందించారు. శిక్షణలో భాగంగా నిర్వహించిన గ్రూప్ చర్చలు, అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేశారు. సమస్యలను గుర్తించడం, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడం, సమిష్టిగా పనిచేసే విధానాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్య అవగాహన, సామాజిక చైతన్యం కూడా విద్యార్థినుల భవిష్యత్తుకు ఎంతో అవసరమని, ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు బాలికల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించి సమాజంలో బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగడానికి దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో వాయిస్–4 గర్ల్స్ బృందం సభ్యులు, ఉపాధ్యాయులు, వార్డెన్ ఎన్. గోపాల్ తదితరులు పాల్గొన్నారు.