ఆమనగల్లు, జూలై 4 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలనే లక్ష్యంతో ఆకుతోటపల్లి గ్రామ సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి శనివారం జెడ్పీహెచ్ఎస్ ఆకుతోటపల్లి పాఠశాలకు అవసరమైన కొత్త వంట పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యాహ్న భోజనం తయారీలో వినియోగించే పాత్రలు శుభ్రంగా, నాణ్యంగా ఉంటేనే విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని పేర్కొన్నారు. అందుకే పాఠశాలకు అవసరమైన అన్ని వంట పాత్రలను కొత్తగా కొనుగోలు చేసి ప్రధానోపాధ్యాయులు చందూలాల్కు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు విజయ్ కుమార్, సాజిద్, మాజీ సర్పంచ్ రామచందర్, పూర్వ విద్యార్థి సెహ్వాగ్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.