నల్లగొండ, జూలై 3 (చైతన్యగళం): నల్లగొండ జిల్లా జమీయత్ ఉలేమా-ఏ-హింద్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి 9 గంటలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా ఫారమ్ ఎలా నింపాలి, ఏ పత్రాలు అవసరం, ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి జమీయత్ ఉలేమా-ఏ-హింద్ జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ బషీర్ సహాబ్ అధ్యక్షత వహించగా, నల్లగొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ (అమీర్), మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ (ఎలక్షన్) ఆజమ్ ఖాన్, ఎంఆర్వో కొట్టపల్లి పర్షురాం, ఖాజీ ఇక్రముల్లా తదితరులు పాల్గొన్నారు.ఆర్డీవో అశోక్ రెడ్డి మాట్లాడుతూ, “ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అనవసర భయాలు అవసరం లేదు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సరైన వివరాలు, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలి” అని సూచించారు.మౌలానా అబ్దుల్ బషీర్ సహాబ్ మాట్లాడుతూ, “ముస్లిం మైనార్టీలు వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలను పాటించాలి. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన సందేహాలను నేరుగా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్టీలు, ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు పాల్గొని ఎస్ఐఆర్ ప్రక్రియపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.