మహబూబాబాద్, జూలై 2 (చైతన్య గళం):
మహబూబాబాద్ ఆశ్రమంలో గురువారం దైవకృప వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 40 మంది వికలాంగులకు ఉచిత ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ఆశ్రమ నిర్వాహకుడు భానోత్ లోకేష్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా టౌన్ సీఐ లతకుల రఘుపతి రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు ట్రైసైకిళ్లను అందజేశారు.ఈ సందర్భంగా సీఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ, “నిరుపేదలు, వికలాంగులు, అనాథలు, వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మం. భానోత్ లోకేష్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తి” అని అన్నారు. వికలాంగులు ఆత్మన్యూనతకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.భానోత్ లోకేష్ మాట్లాడుతూ, “సమాజంలో అవసరమైన వారికి చేయూత అందించడమే మా సంస్థ లక్ష్యం. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకుడు శంతన్ రామరాజు, చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నగవాణి, అలాగే సెవ్యా నాయక్, ఏసుపాదం, ఏలీయాతో పాటు పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.