సిద్దిపేట, జూలై 02 {చైతన్యగళం}
మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జి ఎస్ ) ఆర్థిక సాధికారతకు మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్ హెచ్ జి. రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇన్స్పెక్షన్ ఛార్జీలకు 100 శాతం మినహాయింపు ప్రకటించింది. బ్యాంకు క్రెడిట్ అప్రూవల్ కమిటీ ఆమోదంతో ఈ నిర్ణయం 2026 జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చినట్లు సిద్దిపేట రీజినల్ హెడ్, లీడ్ బ్యాంక్ అధికారి బి. శ్రీనివాస్ తెలిపారు. కొత్త నిర్ణయం ప్రకారం క్యాష్ క్రెడిట్ సిసి . రుణాల్లో రూ.10 లక్షల వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు. రూ.10 లక్షలకు మించిన రుణాలపై ప్రతి లక్షకు వసూలు చేస్తున్న రూ.350 ప్రాసెసింగ్ ఛార్జీని పూర్తిగా రద్దు చేశారు. టర్మ్ లోన్స్ టిఎల్ . విషయంలో రూ.5 లక్షల వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు. రూ.5 లక్షలకు మించిన రుణాలపై వసూలు చేస్తున్న 1.30 శాతం ప్రాసెసింగ్ ఛార్జీని పూర్తిగా మాఫీ చేశారు. అలాగే రూ.5 లక్షలకు పైబడిన ఎస్ హెచ్ జి రుణాలపై ప్రతి త్రైమాసికం వసూలు చేస్తున్న రూ.500తో పాటు జీఎస్టీ ఇన్స్పెక్షన్ ఛార్జీలను కూడా పూర్తిగా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఒక్కో స్వయం సహాయక సంఘానికి మూడు సంవత్సరాల కాలంలో గరిష్టంగా సుమారు రూ.31,860 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని బ్యాంకు తెలిపింది. రుణ వ్యయం తగ్గడంతో మహిళా సంఘాలకు తక్కువ ఖర్చుతో రుణాలు అందుబాటులోకి రావడంతో పాటు మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి, గ్రామీణ జీవనోపాధి అభివృద్ధికి ఇది దోహదపడనుంది. మరిన్ని మహిళా సంఘాలు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరి ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా రీజినల్ హెడ్ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ప్రత్యేక రాయితీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తక్కువ వ్యయంతో బ్యాంకు రుణాలు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన అన్ని ఎస్ హెచ్ జి . లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సమీప యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించాలని సూచించారు.