మైత్రి హాస్పిటల్లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
మహబూబాబాద్, జూలై 1 (చైతన్యగళం): జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. హాస్పిటల్ చైర్మన్ సుచిత్ర బాలు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయ అధికారి (DCHS) డాక్టర్ చింత రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం హాస్పిటల్ చీఫ్ డాక్టర్ బాలు నాయక్ (ఎండీ, జనరల్ ఫిజీషియన్), డాక్టర్ నరేంద్ర (యూరాలజిస్ట్), డాక్టర్ నాగార్జున రెడ్డి (ఆర్థోపెడిక్ నిపుణుడు), డాక్టర్ సైదా అలీ (రేడియాలజిస్ట్), డాక్టర్ కుమార్, డాక్టర్ రియాజ్, డాక్టర్ హేమంత్లను పుష్పగుచ్ఛాలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ సుచిత్ర బాలు నాయక్ మాట్లాడుతూ, “వైద్యో నారాయణో హరి అనే సూక్తికి వైద్యులు నిదర్శనం. ప్రజల ప్రాణాలను కాపాడుతూ సమాజానికి ఆరోగ్య భద్రతను అందిస్తున్న వైద్యుల సేవలు అమూల్యమైనవి” అని అన్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని, వైద్యుల అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ముఖ్య అతిథి డాక్టర్ చింత రమేష్ మాట్లాడుతూ, “వైద్య వృత్తి కేవలం ఉద్యోగం కాదు, అది మానవ సేవకు ప్రతీక. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి వైద్యుడికి సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.