CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 6:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎదురెదురుగా ఢీకొన్న ఆటో–బైక్.. యువకుడి దుర్మరణం

ఆమనగల్లు, జూలై 1 (చైతన్య గళం‌):
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుడు మాడుగుల మండలం ఫకీరతండాకు చెందిన మల్లేష్ (28)గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేష్ ద్విచక్ర వాహనంపై ఆమనగల్లు నుంచి స్వగ్రామమైన ఫకీరతండాకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు మల్లేష్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించగా, ఫకీరతండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.