మహబూబాబాద్, జూలై 1 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం మూడో రోజు విజయవంతంగా ముగిసింది. సబ్ యూనిట్ ఆఫీసర్ వడ్డేబోయిన శ్రీనివాస్ కలెక్టర్ గృహం పరిసరాలు, ఆర్డీఓ కార్యాలయ వీధి, బస్టాండ్ మెయిన్ రోడ్ సబ్ సెంటర్, అంబేద్కర్ నగర్, గిరి ప్రసాద్ నగర్ కాలనీ, గుమ్ముడూరు తదితర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే, పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండు రోజులుగా పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి తప్పనిసరిగా టీకాలు వేయాలని సిబ్బందికి సూచించారు. పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారి టీకా పొందడం అత్యంత కీలకమని, ఊరికి వెళ్లి తిరిగి వచ్చిన కుటుంబాల పిల్లలను ప్రత్యేకంగా గుర్తించి ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా చూడాలని ఆదేశించారు.
ఇంటింటి సర్వేను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతి ఇంటి వివరాలను నమోదు చేసి కార్యక్రమాన్ని శాతం 100 పూర్తి చేయాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇదే కృషి కొనసాగితే మహబూబాబాద్ జిల్లాను పోలియో రహిత జిల్లాగా నిలబెట్టడంతో పాటు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ముందువరుసలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు అరుణ, సుమలత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.