CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 11:11 am Posted by : CHAITHANYA GALAM NEWS

“ఆపరేషన్ ముస్కాన్–12” ప్రారంభం

మహబూబాబాద్(చైతన్యగళం):
జిల్లాలో జూలై 1 నుంచి 31 వరకు “ఆపరేషన్ ముస్కాన్–12” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులు, భిక్షాటన చేస్తున్న పిల్లలు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించి రక్షించి వారి కుటుంబాలకు చేర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు జిల్లాలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు వంటి ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు.

బాల కార్మికులను నియమించుకునే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ, తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు డార్పణ్ యాప్ ద్వారా ఆధునిక ముఖ గుర్తింపు సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. చిన్నారుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు.