ఖానాపూర్ (చైతన్యగళం): పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని పి.ఆర్.టి.యు అధ్యక్షులు నరేంద్రబాబు డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా మలక్ చించోలి బి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సగం కృష్ణ పదవీ విరమణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. సగం కృష్ణ ఉద్యోగ కాలంలో పాఠశాల అభివృద్ధికి కృషి చేసి, విద్యార్థుల సంఖ్య పెంచి, నిధులను సమర్థవంతంగా వినియోగించి, పిల్లలతో మమేకమై ఆటపాటల ద్వారా విద్యాబోధన చేసినట్లు ఆయన గుర్తుచేశారు.
ప్రభుత్వ నిబంధనలను క్రమశిక్షణతో పాటించిన ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లిస్తే వారు ఆర్థిక భారంలేకుండా జీవించగలరని నరేంద్రబాబు అన్నారు. “పదవీ విరమణ అంటే సగం జీవితంతో జీవించాల్సిన పరిస్థితి. బకాయిలు రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు ఈఎంఐలు, అప్పులు, రుణబాధలతో ఆందోళనలో ఉన్నారు. చాలామంది బకాయిలు రాక చనిపోయారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా ప్రభుత్వం ప్రతినెల అధిక నిధులు సమకూర్చి పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వినయ్, రాజు, బంధువులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్, తూము సంజీవ్ రావ్, బీరవెల్లి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సాయన్న, మలక్ చించోలి సర్పంచ్, ఉప సర్పంచ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.